Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో మరో అరుదైన వృక్షజాతి వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లా తూర్పు కనుమల్లో గుర్తించిన కొత్త మొక్కకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ “క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్” (Croton Ubbalamadugensis) అనే పేరును ఖరారు చేశారు. ఉబ్బలమడుగు జలపాతం సమీపంలోని కంబకం కొండల్లో మాత్రమే ఈ మొక్క కనిపించడంతో, ఆ ప్రాంతానికి గుర్తింపుగా ఈ నామకరణం చేశారు. యూఫోర్బియేసీ కుటుంబానికి చెందిన ఈ జాతి ఆకులు ప్రత్యేకమైన సుగంధాన్ని వెదజల్లడం దీని ప్రధాన విశేషంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రధాన అటవీ సంరక్షణాధికారి పి.వి. చలపతిరావు నేతృత్వంలోని పరిశోధక బృందం తూర్పు కనుమల్లో నిర్వహించిన వృక్షశాస్త్ర అధ్యయనాల సందర్భంగా ఈ కొత్త జాతిని గుర్తించింది. ఇప్పటికే ఉన్న క్రోటన్ అరోమాటికస్ జాతితో పోలిస్తే దీని నిర్మాణం, పునరుత్పత్తి లక్షణాలు పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు శాస్త్రీయ పరిశీలనల్లో తేలింది. అత్యంత పరిమిత ప్రాంతంలో మాత్రమే పెరుగుతుండటంతో ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆవిష్కరణ తూర్పు కనుమల జీవ వైవిధ్య ప్రాధాన్యాన్ని మరోసారి చాటగా, అరుదైన వృక్షజాతుల సంరక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని నిపుణులు సూచిస్తున్నారు.








