తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న “మధ్యాహ్న భోజన పథకం (Mid-Day Meal Scheme)”లో కీలక మార్పులను పరిశీలిస్తోంది. విద్యార్థులకు వారానికి ఒకరోజు చికెన్ బిర్యానీ(Chicken Biryani) అందించే ప్రతిపాదనను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి ఏ. రాజ్మోహన్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి విజయ్ పరిశీలనకు పంపించినట్లు ఆయన తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం రాష్ట్రంలో ఎన్నో దశల్లో అభివృద్ధి చెందిందని మంత్రి పేర్కొన్నారు. జస్టిస్ పార్టీ హయాంలో ప్రారంభమైన ఈ పథకాన్ని కామరాజ్ విస్తరించగా, కరుణానిధి గుడ్లను మెనూలో చేర్చారని గుర్తుచేశారు.
అనంతరం ఎంజీఆర్, జయలలిత పోషకాహార విలువలు పెంచేలా మరిన్ని ఆహార పదార్థాలను చేర్చారని వివరించారు. అదే తరహాలో విద్యార్థులకు పోషకాహారం, రుచికరమైన భోజనం అందించేందుకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి భోజనానికి సుమారు రూ.15 ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ఉదయం అల్పాహార పథకంలో అందిస్తున్న ఉప్మా వంటి వంటకాల స్థానంలో మరింత పోషకవిలువలు కలిగిన, వైవిధ్యమైన ఆహారాన్ని అందించే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
అయితే చికెన్ బిర్యానీని మిడ్-డే మీల్లో చేర్చే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీనివల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం, అమలు విధానం, పోషకాహార ప్రమాణాలు, సరఫరా వ్యవస్థ వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం అధికారిక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ALSO READ: CRPF | ఒత్తిడికి లొంగొద్దు.. సాహసంగా విధులు నిర్వహించండి: జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్








