Bhogapuram Airport: ఉత్తరాంధ్ర వైమానిక రవాణాలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 అర్ధరాత్రి 12:01 గంటల నుంచి షెడ్యూల్ కమర్షియల్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రస్తుతం సివిల్ ఎన్క్లేవ్గా పనిచేస్తున్న విశాఖపట్నం విమానాశ్రయం నుంచి రెగ్యులర్ వాణిజ్య విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది.
ఈ నిర్ణయం ప్రకారం వచ్చే 30 ఏళ్ల పాటు షెడ్యూల్ కమర్షియల్ సర్వీసులు భోగాపురం విమానాశ్రయం నుంచే నిర్వహించనున్నారు. అయితే జాతీయ అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. విశాఖ విమానాశ్రయం నుంచి భారత నౌకాదళం, వాయుసేన, ఇతర రక్షణ దళాలు, పోలీసు శాఖ, వీఐపీ, ప్రభుత్వ ప్రత్యేక విమానాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయి. నాన్షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాలకు కూడా అనుమతి కొనసాగుతుందని కేంద్రం తెలిపింది.
ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయానికి ఉపయోగిస్తున్న VTZ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కోడ్ను కూడా ఆగస్టు 17 నుంచే భోగాపురం విమానాశ్రయానికి బదిలీ చేయనున్నారు. పీపీపీ విధానంలో జీఎంఆర్ సంస్థ నిర్మించిన ఈ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును అధికారికంగా ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక ఆమోదంతో భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర వైమానిక రవాణాకు కీలక కేంద్రంగా మారేందుకు సిద్ధమైంది.
ALSO READ: Telangana Weather | హైదరాబాద్కు రెడ్ అలర్ట్.. మరో గంటలో కుండపోత వర్షం!








