Women’s Reservation Bill: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రవెల్లి నివాసంలో కేటీఆర్, హరీష్ రావులతో జరిగిన సమావేశంలో జాతీయ రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కేంద్రానికి స్పష్టమైన సందేశం ఇచ్చారు.
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కేసీఆర్ ప్రకటించారు. గతంలోనే తమ ప్రభుత్వం అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ కోసం తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యసభలో కూడా తమ ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు ఇస్తారని ఆయన స్పష్టం చేశారు.
అయితే డీలిమిటేషన్ బిల్లుపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని, 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ అమలు చేస్తే అసమానతలు పెరుగుతాయని హెచ్చరించారు.
పార్టీ సంస్థాగత అంశాలపై కూడా కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న భారీ బహిరంగ సభ, అలాగే ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్, హరీష్ రావులకు సూచించారు.








