AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు 2026 విడుదలయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి విద్యాశాఖ ప్రకటించింది. ఈసారి ఫలితాలు గత 12 ఏళ్ల రికార్డును అధిగమించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ resultsbie.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న “మన మిత్ర” వాట్సాప్ సేవ ద్వారా 9552300009 నంబర్కు “Hi” పంపడం ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే సౌకర్యం కల్పించారు.
ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల కనిపించింది. మొదటి సంవత్సరంలో 77 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, రెండో సంవత్సరంలో 81 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది.
ఇది గత 12 సంవత్సరాల్లో అత్యుత్తమ ఫలితంగా ప్రభుత్వం ప్రకటించింది. రెండో సంవత్సరం ఫలితాలు గత 12 ఏళ్లలో రెండో అత్యుత్తమ స్థాయికి చేరాయి.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా మంచి ఫలితాలు నమోదయ్యాయి. మొదటి సంవత్సరంలో 54 శాతం ఉత్తీర్ణతతో గత 12 ఏళ్లలో అత్యుత్తమ స్థాయి సాధించగా, రెండో సంవత్సరంలో 68 శాతం ఉత్తీర్ణతతో రెండో అత్యుత్తమ ఫలితంగా నిలిచింది.
ఈ విజయానికి విద్యార్థుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వం, ప్రిన్సిపాళ్ల శ్రమ, విద్యాశాఖ సమన్వయమే కారణమని అధికారులు పేర్కొన్నారు.
ఫలితాలు రానివారు నిరుత్సాహపడవద్దని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఈ అపజయాన్ని విజయానికి తొలి మెట్టుగా భావించి మరింత కష్టపడాలని ఆయన విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చారు.








