India–EU Trade Deal: యూనియన్ బడ్జెట్ సమావేశాల వేళ దేశ ప్రజలకు ఊరట కలిగించే శుభవార్త వెలువడింది. భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందంతో దేశంలో పలు దిగుమతి వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI), యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ సమక్షంలో ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు అధికారికంగా వెల్లడైంది.
ఈ ఒప్పందం ప్రకారం, ఈయూ దేశాల నుంచి భారత్కు దిగుమతి అయ్యే 96.6 శాతం వస్తువులపై సుంకాలను తొలగించనున్నారు. దీని ప్రభావంతో కార్లు, వైన్, బీర్, విస్కీ, వోడ్కా, ఆలివ్ ఆయిల్, కివీస్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రూట్ జ్యూస్, కూరగాయల నూనెల ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే స్పిరిట్స్పై ఉన్న 40 శాతం సుంకాన్ని కూడా తగ్గించారు.
ఇక యూరోపియన్ ఆప్టికల్, సర్జికల్, మెడికల్ పరికరాలపై 90 శాతం సుంకాలు రద్దు చేయనున్నారు. యంత్రాలపై 44 శాతం, రసాయనాలపై 22 శాతం, ఔషధాలపై 11 శాతం వరకు సుంకాల తొలగింపు జరగనుంది. భారత్ నుంచి ఈయూకి వెళ్లే విమానాలు, అంతరిక్ష నౌక ఎగుమతులపై కూడా సుంకాలు తొలగించనున్నారు.
ఈ ఒప్పందం విలువ సుమారు 136 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. 2032 నాటికి భారత్–ఈయూ మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈ డీల్ కుదిరిందని అధికార వర్గాలు తెలిపాయి.
ALSO READ:Municipal Elections in Telangana | మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం.. ఫిబ్రవరి 11న పోలింగ్
