Union Cabinet: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశ మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రహదారులు, రైల్వేలు, మెట్రో, విమానయానం, పోర్టుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
కేబినెట్ ఆమోదించిన ప్రధాన ప్రాజెక్టుల్లో ఢిల్లీలో నిర్మించనున్న ద్వారకా అండర్గ్రౌండ్ టన్నెల్కు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. సుమారు రూ.6,970 కోట్ల అంచనా వ్యయంతో ఆరు లేన్ల సామర్థ్యంతో ఈ టన్నెల్ను నిర్మించనున్నారు. మొత్తం 8.1 కిలోమీటర్ల పొడవున అభివృద్ధి చేయనున్న ఈ కారిడార్, ద్వారకా ఎక్స్ప్రెస్వేను దక్షిణ, తూర్పు ఢిల్లీ ప్రాంతాలతో అనుసంధానించనుంది. దీనివల్ల గురుగ్రామ్, పశ్చిమ ఢిల్లీ నుంచి ప్రయాణించే వారికి ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణ సమయం గణనీయంగా ఆదా కానుంది.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దక్షిణ రిడ్జ్ అటవీ ప్రాంతానికి ఎలాంటి నష్టం జరగకుండా టన్నెల్ను పూర్తిగా భూగర్భంలో నిర్మించాలని ప్రధాని మోదీ సూచించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో దాదాపు 3.14 కిలోమీటర్ల ట్విన్-ట్యూబ్ టన్నెల్ నిర్మించనుండగా, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అదే సమావేశంలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్–కబ్రాయ్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు రూ.7,145 కోట్ల వ్యయంతో ఆమోదం లభించింది. దీంతో బుందేల్ఖండ్ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.
ఇవే కాకుండా దేశవ్యాప్తంగా 57 రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులకు భారీ నిధులు, 12 కొత్త మెట్రో ప్రాజెక్టుల విస్తరణ, పోర్టుల ఆధునీకరణ, నౌకాయాన రంగ సంస్కరణలు, ఐదు కొత్త విమానాశ్రయాల నిర్మాణం, అలాగే ఉడాన్ పథకం విస్తరణకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు దేశ మౌలిక వసతుల రంగానికి మరింత ఊతమిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.








