Revanth Reddy: హైడ్రా(HYDRA) వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చిన ప్రధాన సంస్కరణల్లో హైడ్రా ఒకటని పేర్కొంటూ, అక్రమ ఆక్రమణలపై చర్యలు మరింత కఠినంగా కొనసాగుతాయని చెప్పారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కొందరు నకిలీ పత్రాలను ఆధారంగా చేసుకుని న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ నియామకంపై ఇటీవల తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా సీఎం స్పందించారు. రంగనాథ్ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని హైకోర్టు ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే అధికారుల నియామకం, బాధ్యతల కేటాయింపు పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని పరిపాలనా నిర్ణయమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైడ్రాను మరింత బలోపేతం చేస్తామని, అక్రమ ఆక్రమణల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని ఆయన సంకేతాలు ఇచ్చారు.








