Bay of Bengal: మంగళవారం ఉదయం బంగాళాఖాత ప్రాంతంలో భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.6గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (NCS) వెల్లడించింది. ఉదయం 7:43 గంటల 17 సెకన్ల సమయంలో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు.
భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఎన్సీఎస్ సమాచారం ప్రకారం, 14.027 ఉత్తర అక్షాంశం, 93.132 తూర్పు రేఖాంశం వద్ద బంగాళాఖాతంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది.
ఈ విషయాన్ని ఎన్సీఎస్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరి 11న కూడా బంగాళాఖాతంలో 4.3 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఆ ప్రకంపనలు కూడా 10 కిలోమీటర్ల లోతులోనే సంభవించాయని అధికారులు అప్పట్లో వెల్లడించారు.
భూకంపాల లోతును శాస్త్రవేత్తలు మూడు విభాగాలుగా వర్గీకరిస్తారు. 0 నుంచి 70 కిలోమీటర్ల లోతులో సంభవించే భూకంపాలను అల్ప లోతు (Shallow) భూకంపాలు అంటారు.
70 నుంచి 300 కిలోమీటర్ల మధ్య సంభవించేవి మధ్యస్థ లోతు భూకంపాలు కాగా, 300 నుంచి 700 కిలోమీటర్ల లోతులో నమోదయ్యేవి లోతైన (Deep Focus) భూకంపాలుగా పరిగణిస్తారు. సాధారణంగా 70 కిలోమీటర్లకు మించిన లోతులో సంభవించే ప్రకంపనలను డీప్-ఫోకస్ భూకంపాలుగా వ్యవహరిస్తారు.








