భారత రైల్వేలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ దేశంలో తొలి హైడ్రోజన్ ఇంధన రైలు( First Hydrogen Train) సేవలు ప్రారంభమయ్యాయి. డీజిల్కు వాడే బదులుగా హైడ్రోజన్తో నడిచే ఈ రైలు పర్యావరణ పరిరక్షణతో పాటు స్వచ్ఛమైన ఇంధన వినియోగానికి ప్రాధాన్యం ఇస్తోంది. రైలులోని ఫ్యూయల్ సెల్లో హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య జరిగే రసాయన చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
అదే విద్యుత్తో మోటార్లు పనిచేస్తాయి. మిగిలిన విద్యుత్ను బ్యాటరీల్లో నిల్వ చేసి అవసరమైనప్పుడు వినియోగిస్తారు. డీజిల్ ఇంజిన్ల మాదిరిగా పొగ, కార్బన్ డైఆక్సైడ్ విడుదల కాకుండా నీటి ఆవిరి మాత్రమే విడుదల కావడం ఈ రైలు ప్రత్యేకత. ప్రస్తుతం ఈ రైలు హరియాణాలోని జింద్-సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో రోజుకు రెండు ట్రిప్లు నిర్వహిస్తోంది. ప్రయాణికులకు రూ.5 నుంచి రూ.25 మధ్య టికెట్ ధర ఉండే అవకాశం ఉంది.
సాధారణంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలు ట్రయల్లో గంటకు 120 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది. ఈ హైడ్రోజన్ రైలులో రెండు పవర్ కార్లు, ఎనిమిది ప్రయాణికుల కోచ్లు ఉన్నాయి. మొత్తం 682 మంది కూర్చునే సదుపాయం ఉండగా, ఒకేసారి దాదాపు 2,600 మంది వరకు ప్రయాణించే సామర్థ్యం కల్పించారు. ముందస్తు భద్రత కోసం హైడ్రోజన్ లీకేజీని గుర్తించే ఆధునిక సెన్సార్లు, అగ్నిప్రమాద హెచ్చరిక వ్యవస్థలు, రైలును నిరంతరం పర్యవేక్షించే స్మార్ట్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు.








