ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలో కీలక ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద అడుగు పడింది. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి(Basavatarakam Cancer Hospital) నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. తుళ్లూరు సమీపంలో రూ.750 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 21 ఎకరాల భూమిని కేటాయించింది.
మొదటి దశలోనే 500 పడకలతో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొందిన తరువాతే పనులు ప్రారంభించామని తెలిపారు. అమరావతి ప్రాంత ప్రజలు ఈ ఆస్పత్రి కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, అత్యాధునిక వైద్య పరికరాలతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని, రోగులకు అత్యుత్తమ చికిత్స అందించడమే లక్ష్యమని వివరించారు.
హైదరాబాద్లో ఉన్న బసవతారకం ఆస్పత్రి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 22న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.








