AP Gold Mining Exploration: ఆంధ్రప్రదేశ్లో ఖనిజ సంపదను వెలికితీసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా బంగారు ఖనిజ నిక్షేపాల గుర్తింపు, అన్వేషణ, తవ్వకాల ప్రక్రియను వేగవంతం చేయాలని గనుల శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బంగారు నిల్వలు ఉండే అవకాశాలపై అందుబాటులో ఉన్న భౌగోళిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని విస్తృత స్థాయిలో పరిశోధనలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో లక్షన్నర హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో బంగారు ఖనిజాలు లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి కొనసాగుతుండగా, ఇప్పుడు అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాలను కూడా అన్వేషణ జాబితాలో చేర్చారు. ఈ ప్రాంతాల్లో ఖనిజ నిల్వల సామర్థ్యాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడానికి వివిధ దశల్లో సర్వేలు నిర్వహించనున్నారు. ఈ అన్వేషణ కార్యక్రమాలను జీ-4 నుంచి జీ-1 వరకు దశలవారీగా అమలు చేయనున్నారు. ప్రారంభ దశలో భౌగోళిక అధ్యయనాలు, అనంతరం శాంపిళ్ల సేకరణ, డ్రిల్లింగ్, ఖనిజ నాణ్యత నిర్ధారణ వంటి ప్రక్రియలు చేపట్టనున్నారు.
జాతీయ ఖనిజ అన్వేషణ అభివృద్ధి నిధి (NMET) ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అన్వేషణ పూర్తయ్యాక బంగారు నిల్వల పరిమాణం, నాణ్యతపై స్పష్టత రానుంది. అనంతరం వాణిజ్యపరంగా తవ్వకాలు చేపట్టే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించనుంది.
ఈ ప్రాజెక్టులు విజయవంతమైతే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థతో పాటు ఖనిజ రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఇది కీలక మలుపు కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
AP Gold Mining Exploration | ఏపీ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్?.. బంగారు గనుల అన్వేషణకు గ్రీన్ సిగ్నల్!
-








