UPI Digital Payment: డిజిటల్ చెల్లింపుల విభాగంలో భారత్-స్పెయిన్ మధ్య కొత్త భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టనుంది. భారత్కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI), స్పెయిన్కు చెందిన బిజుమ్ (Bizum) చెల్లింపు వ్యవస్థలను అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ విధానం అమల్లోకి వస్తే రెండు దేశాల మధ్య జరిగే అంతర్జాతీయ నగదు బదిలీలు మరింత సులభంగా, వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.
కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ స్పెయిన్ పర్యటన సందర్భంగా ఈ అంశంపై చర్చలు జరిగాయి. యూపీఐ-బిజుమ్ కనెక్షన్తో సరిహద్దులు దాటే చెల్లింపులు సులభతరం అవుతాయని, దీని ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం, నిపుణుల రాకపోకలను సులభతరం చేయడం వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి. యూరప్, లాటిన్ అమెరికాకు అనుసంధాన కేంద్రంగా ఉన్న స్పెయిన్ను ఉపయోగించుకుని సంయుక్త పెట్టుబడులను పెంచాలని నిర్ణయించారు.
వాహనాలు, ఫార్మా, రసాయనాలు, వస్త్రాలు, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం, మౌలిక వసతుల రంగాల్లో సహకారాన్ని విస్తరించాలని భారత్, స్పెయిన్ అంగీకరించాయి. ఇదే సమయంలో బ్రస్సెల్స్ పర్యటనలో పీయూష్ గోయల్ యూరోపియన్ యూనియన్తో వాణిజ్య చర్చలు జరిపారు. పెట్టుబడుల రక్షణ ఒప్పందం, జీఐ ట్యాగ్ ఒప్పందం, కార్బన్ బోర్డర్ నిబంధనలపై కూడా చర్చలు కొనసాగాయి.
ALSO READ: COVID-19 cases | ఏపీలో కోవిడ్ టెన్షన్.. కొత్తగా రెండు కేసులు నమోదు








