India-Pakistan: AI టెక్నాలజీ నిరంతరం అభివృద్ధి చెందుతూ ఎంటర్టైన్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ రంగం వరకు విస్తృతంగా ప్రభావితం చేస్తోంది. అయితే అదే AI కొన్ని సందర్భాల్లో గందరగోళానికి కూడా కారణమవుతోంది. ప్రస్తుతం అలాంటి ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీ20 వరల్డ్ కప్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడినట్లు, మ్యాచ్ సమయంలో భారత, పాక్ క్రికెటర్ల మధ్య గొడవ జరిగినట్లు చూపించే ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మరియు పాకిస్తాన్ ఆటగాళ్లు గొడవకు దిగినట్లు, ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నట్లు వీడియోలో ప్రదర్శించారు. అంపైర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని నియంత్రించినట్లు కూడా ఆ వీడియోలో కనిపించింది. అయితే వాస్తవానికి అలాంటి ఘటన మ్యాచ్లో ఎక్కడా జరగలేదని స్పష్టమైంది. ఇది పూర్తిగా AI సాంకేతికతతో తయారు చేసిన ఫేక్ వీడియో అని తర్వాత నిర్ధారణ అయింది. నిజానికి ఆ మ్యాచ్లో భారత్ అద్భుత ప్రదర్శనతో 64 పరుగుల తేడాతో పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది.
భారత్ తరఫున స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్ బ్యాటింగ్లో రాణించగా, దీప్తి శర్మ, శ్రీచరణి బౌలింగ్లో కీలక పాత్ర పోషించారు. పాక్ జట్టు 106 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఫేక్ వీడియో కారణంగా క్రికెట్ అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. సోషల్ మీడియాలో నిజం–అబద్ధం మధ్య తేడా గుర్తించడం కష్టమవుతోందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. AI కంటెంట్ను విశ్వసించే ముందు వాస్తవ నిర్ధారణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.








