SRSP Project: శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) ప్రాజెక్టు పనితీరు, నీటి నిల్వలు, సాగునీటి పరిస్థితులను తెలుసుకునేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. తెలంగాణ వ్యవసాయానికి ఎస్సారెస్పీ వెన్నెముకగా నిలిచిందని, 56 ఏళ్లుగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ రైతులకు జీవనాధారంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టులో పూడిక పెరగడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని పూడికతీతకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం గతేడాదితో పోలిస్తే నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే రెండు రోజుల్లో సాగునీటి విడుదలపై తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అంశంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను మంత్రి ఖండించారు. సాంకేతిక లోపాలతో దెబ్బతిన్న ఈ ప్రాజెక్టుల పునరుద్ధరణకు ప్రభుత్వం శాస్త్రీయ విధానంలో చర్యలు తీసుకుంటోందని, కేంద్ర జల సంఘం (CWC) కూడా ఆ చర్యలకు మద్దతు తెలిపిందన్నారు.
కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, రాష్ట్రంలోని సాగునీటి పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. నాగార్జునసాగర్కు కూడా ఎగువ నుంచి నీటి ప్రవాహం మెరుగుపడే అవకాశాలున్నాయని, రైతులకు సాగునీటి కొరత రాకుండా అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.
ALSO READ: Ajit Doval | ‘నచ్చినట్లు జీవించడం కాదు.. దేశం కోసం పనిచేయండి’.. అజిత్ దోవల్ సందేశం








