CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే చర్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ శాఖల ద్వారా వచ్చే ఆదాయాన్ని సమర్థవంతంగా పెంచేందుకు ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావుతో పాటు వివిధ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. శాఖల వారీగా ఆదాయ వనరులు, వసూళ్ల పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, మైనింగ్ తదితర శాఖల్లో రెవెన్యూ లీకేజీలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి రూపాయి సమయానికి ఖజానాకు చేరేలా సమర్థవంతమైన వ్యవస్థను అమలు చేయాలని సూచించారు.
పెండింగ్ బకాయిల వసూళ్లను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ‘చేజింగ్ సెల్’ ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి శాఖ తన ఆదాయ సామర్థ్యాన్ని విశ్లేషించుకుని లక్ష్యాలను అధిగమించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
అభివృద్ధి ప్రాజెక్టుల అమలులో భూసేకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్న రేవంత్ రెడ్డి, అవసరమైన అన్ని శాఖలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆదాయ పెంపు, నిధుల సమీకరణ విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించబోమని స్పష్టం చేస్తూ, ఫలితాల ఆధారంగా శాఖల పనితీరును సమీక్షిస్తామని అధికారులను హెచ్చరించారు.








