India A vs Sri Lanka A: శ్రీలంకలో నిర్వహిస్తున్న ట్రై సిరీస్ తొలి వన్డే మ్యాచ్లో ఇండియా-A ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ శతకంతో ఆకట్టుకున్నాడు.దంబుల్లా వేదికగా శ్రీలంక-Aపై ఆడిన ఈ మ్యాచ్లో గైక్వాడ్ తన 100వ లిస్ట్-A మ్యాచ్ను సెంచరీతో మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ 14 పరుగులు, ప్రభ్సిమ్రన్ సింగ్ 2 పరుగులకే పెవిలియన్ చేరడంతో భారత్-A కేవలం 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.
ఆ తర్వాత వచ్చిన ప్రియాంశ్ ఆర్యా 32 పరుగులు చేసి కొంత స్థిరత్వం తీసుకొచ్చినా అతను కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ తిలక్ వర్మతో కలిసి నాలుగో వికెట్కు 150 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఇద్దరూ శ్రీలంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ను మళ్లీ గాడిలో పెట్టారు.
గైక్వాడ్ 113 బంతుల్లో 101 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేశాడు. అతని ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇది అతనికి లిస్ట్-A కెరీర్లో 21వ సెంచరీ కావడం విశేషం. అదే సమయంలో తన 100వ లిస్ట్-A మ్యాచ్లో శతకం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాడు. కెప్టెన్ తిలక్ వర్మ కూడా 97 బంతుల్లో 60 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. చివరి దశలో ఆయుష్ బదోని 24 పరుగులు, సూర్యాంశ్ షెడ్గే 26 నాటౌట్గా వేగంగా స్కోరు జోడించడంతో భారత్-A జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.
మొదటగా జట్టులో ఎంపిక కాలేకపోయిన గైక్వాడ్కు రియాన్ పరాగ్ గాయం కారణంగా చివరి నిమిషంలో అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని అతను పూర్తిగా వినియోగించుకొని అద్భుత శతకంతో తన సత్తా చాటాడు. శ్రీలంక బౌలింగ్లో మహ్మద్ షిరాజ్ రెండు వికెట్లు తీసినా భారీ పరుగులు ఇచ్చాడు. ఇక ఇతర బౌలర్లు తలో వికెట్ తీసుకున్నప్పటికీ భారత్ భారీ స్కోరును ఆపలేకపోయారు.








