Zoji La Tunnel: దేశ మౌలిక రంగంలో మరో కీలక ఘట్టంగా జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ నిలిచింది.హిమాలయ పర్వతాల క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులను దాటుకుంటూ నిర్మితమవుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్లో కీలక ‘బ్రేక్త్రూ’ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా హాజరయ్యారు.
మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) ఆధ్వర్యంలో నిర్మాణం కొనసాగుతున్న ఈ టన్నెల్, భారత ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ప్రాజెక్ట్గా భావిస్తున్నారు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ నిర్మాణ పనులు నిరంతరంగా కొనసాగుతూ కీలక దశలను అధిగమిస్తోంది. శ్రీనగర్ నుంచి లడఖ్ వరకు ఉన్న జాతీయ రహదారి-1 (NH-1) మొత్తం 421 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది.
ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణించాలంటే 13,000 అడుగులకుపైగా ఎత్తైన పర్వత ప్రాంతాలను దాటాల్సి ఉండటంతో 12 నుంచి 14 గంటల సమయం పడుతోంది. ముఖ్యంగా బల్తాల్ నుంచి మీన్మార్గ్ వరకు ఉన్న 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు సుమారు నాలుగు గంటలు పడుతోంది. అయితే జోజిలా టన్నెల్ పూర్తయితే ఇదే దూరాన్ని కేవలం 15 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో లడఖ్ ప్రాంతానికి రవాణా సౌకర్యం వేగవంతం కావడమే కాకుండా అన్ని కాలాల్లోనూ నిరంతర కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.
13.153 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమవుతున్న ఈ టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మించబడుతున్న పొడవైన సింగిల్ ట్యూబ్ బై-డైరెక్షనల్ టన్నెల్గా గుర్తింపు పొందుతోంది. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఈ నిర్మాణం కొనసాగుతోంది.
MEIL ఆధునిక న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (NATM) సాంకేతికతను వినియోగిస్తూ నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది. 2020లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్లో వేలాది మంది ఇంజినీర్లు, కార్మికులు అత్యంత కఠిన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు.
హిమాలయ ప్రాంతంలో మైనస్ 20 నుంచి మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ సుమారు 1,500 మంది సిబ్బంది నిరంతరం పనిచేయడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. మంచు తుఫానులు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలను అధిగమిస్తూ నిర్మాణం కొనసాగుతోంది. భద్రతా ప్రమాణాల్లోనూ MEIL 10 మిలియన్ సేఫ్ మాన్ అవర్స్ సాధించి మరో రికార్డు సృష్టించింది. జోజిలా టన్నెల్ పూర్తయిన తర్వాత జమ్ముకశ్మీర్–లడఖ్ మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా మారిపోనుంది. వ్యూహాత్మకంగా, ఆర్థికంగా, పర్యాటక పరంగా ఈ ప్రాజెక్ట్ దేశానికి కొత్త అవకాశాలను తెరవనుందని నిపుణులు భావిస్తున్నారు.








