టీమిండియా యువ పేసర్, పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh) తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో భారీ మార్పులు చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక్కసారిగా దాదాపు 200 పోస్టులు, రీల్స్ను తొలగించిన అతను డిజిటల్గా తన ప్రొఫైల్ను పూర్తిగా శుభ్రం చేశాడు.
ఈ మార్పుల తర్వాత అతని ఖాతాలో కేవలం 44 పోస్టులు మాత్రమే మిగిలాయి. వాటిలో ఎక్కువగా కుటుంబ ఫోటోలు, బ్రాండ్ ప్రమోషన్లు, వాణిజ్య భాగస్వామ్య పోస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి.
ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా విరాట్ కోహ్లీతో చేసిన వైరల్ రీల్ సహా అనేక వ్యక్తిగత పోస్టులు కూడా కనబడకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే పంజాబ్ కింగ్స్కు సంబంధించిన అన్ని పోస్టులను తొలగించాడన్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. జట్టు ఫోటోతో ఉన్న “సబర్. షుకర్. పంజాబ్” పోస్ట్ ఇంకా అతని ప్రొఫైల్లో కనిపిస్తోంది.
ఈ నిర్ణయం వెనుక వ్యక్తిగత రీబ్రాండింగ్ ప్రయత్నం ఉందా? లేక ఇటీవల వచ్చిన వివాదాల కారణంగా సోషల్ మీడియా నుంచి కొంత దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయమా? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఇటీవల IPL 2026 సీజన్లో అర్ష్దీప్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయినా, 14 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసి పంజాబ్ తరఫున టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. అయితే జట్టు ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది.
అంతేకాకుండా తిలక్ వర్మపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలు, అలాగే యుజ్వేంద్ర చాహల్ ఈ-సిగరెట్ ఉపయోగిస్తున్నట్లు కనిపించిన వ్లాగ్ వివాదం కూడా అతని చుట్టూ చర్చలకు దారితీశాయి. ఈ పరిణామాల తర్వాతే అతను సోషల్ మీడియా ప్రొఫైల్ను శుభ్రం చేసుకున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు.
Arshdeep Singh | అర్ష్దీప్ సింగ్ కు ఏమైంది ..? 200 పోస్టులు డిలీట్ చేసిన స్టార్ పేసర్ ఎందుకు ?
-








