Ponguleti Srinivasa Reddy: ఏదులాపురం మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను వెంటనే పరిశీలించి సంబంధిత అధికారులతో పరిష్కార చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు త్వరలోనే శుభవార్త అందించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
త్వరలోనే పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాల ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉందని, అందుకు యువత సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 75 వేలకుపైగా ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు అందించిందని మంత్రి పేర్కొన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
ప్రజా దర్బార్కు వచ్చిన ప్రతి సమస్యను సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్ టీఎస్, మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, అదనపు కలెక్టర్ శ్రీజతో పాటు పలువురు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.








