West Bengal: పశ్చిమ బెంగాల్లో అధికార మార్పు అనంతరం రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి చెందిన మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది.
షెడ్యూల్ ప్రకారం జూలై 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ అనంతరం అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై, రాత్రికే ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ మూడు స్థానాలు గతంలో రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు పదవీకాలం పూర్తి కాకముందే రాజీనామా చేయడంతో ఖాళీ అయ్యాయి. సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాశ్ చిక్ బరాక్ ఇటీవల రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
కొత్తగా ఎన్నికయ్యే సభ్యులు మిగిలిన పదవీకాలాన్ని పూర్తి చేయనున్నారు. కొందరి పదవీ కాలం 2029 వరకు, మరికొందరి పదవీ కాలం 2030 వరకు కొనసాగనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జూలై 7న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు సమర్పించేందుకు 14వ తేదీతో గడువు ముగియనుంది. 15న నామినేషన్ల పరిశీలన, 17 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మొత్తం ప్రక్రియను జూలై 27లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది.
పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం సీనియర్ అధికారులతో ప్రత్యేక పర్యవేక్షక బృందాలను నియమించనున్నారు. భద్రతా ఏర్పాట్లతో పాటు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా ప్రత్యేక పరిశీలకులను కూడా నియమిస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.








