Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లో ప్రకృతి విపత్తు తీవ్ర కలకలం సృష్టించింది. జమ్మూకశ్మీర్ కిష్టవార్ జిల్లాలోని క్వార్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (540 మెగావాట్లు) ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత అకస్మాత్తుగా తీవ్రమైన మేఘస్ఫోటనం చోటుచేసుకుంది. క్షణాల్లోనే కురిసిన భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి పరిస్థితి తీవ్రంగా మారింది.
మేఘస్ఫోటనం ప్రభావంతో కొండల నుంచి భారీగా బురద, రాళ్లు దిగువ ప్రాంతాల్లోకి ప్రవహించాయి. ప్రాజెక్ట్ పరిసరాల్లో నిలిపి ఉంచిన ట్రక్కులు, ట్యాంకర్లు సహా పలు వాహనాలు మట్టిలో చిక్కుకుపోయాయి. కొన్ని ప్రాంతాలు పూర్తిగా బురదతో నిండిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో డోడా జిల్లా ప్రేమ్ నగర్ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ–కిష్టవార్ జాతీయ రహదారి పూర్తిగా మూసుకుపోయింది. రహదారిపై భారీగా రాళ్లు, శిథిలాలు పేరుకుపోవడంతో వాహన రాకపోకలు ఆగిపోయాయి.
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక బృందాలను రంగంలోకి దించారు. భారీ యంత్రాల సహాయంతో శిథిలాలను తొలగించే పనులు ప్రారంభించారు. రహదారిని తిరిగి తెరవడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. నష్ట తీవ్రతను అంచనా వేస్తూ, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి రెస్క్యూ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయి.
ALSO READ: Rythu Bharosa | వానాకాలం సీజన్లో రైతులకు ఊరట.. డైరెక్ట్గా ఖాతాల్లోకి నిధులు జమ








