Vinesh Phogat: భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) షాక్ ఇచ్చింది. క్రమశిక్షణా ఉల్లంఘనలు, డోపింగ్ నిరోధక నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా జూన్ 26 వరకు దేశీయ పోటీల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేసింది. దీంతో మే 10 నుంచి 12 వరకు ఉత్తర్ ప్రదేశ్లోని గొండాలో జరగనున్న జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో వినేశ్ పాల్గొనే అవకాశాలు లేకుండా పోయాయి.
డబ్ల్యూఎఫ్ఐ ప్రకారం, అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనల మేరకు పదవీవిరమణ తర్వాత తిరిగి పోటీల్లో పాల్గొనాలంటే అవసరమైన ఆరు నెలల నోటీస్ వ్యవధిని వినేశ్ పూర్తి చేయలేదని పేర్కొంది. ఆమె ప్రవర్తన భారత రెజ్లింగ్ ప్రతిష్ఠను దెబ్బతీసిందని, జాతీయ, అంతర్జాతీయ క్రీడా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఎదురైన అనర్హతతో పాటు నాలుగు ప్రధాన అంశాలపై వివరణ ఇవ్వాలని కోరింది.
ఇటీవల గొండాలో పోటీలు నిర్వహించడంపై వినేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్వగ్రామంలో పోటీలు జరగడం తనకు మానసిక ఒత్తిడిని కలిగిస్తోందని పేర్కొంది. బ్రిజ్ భూషణ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా రెజ్లర్లలో తాను కూడా ఉన్నానని గుర్తు చేసింది.
పోటీల సమయంలో తనకు లేదా తన జట్టు సభ్యులకు ఏదైనా జరిగితే బాధ్యత ప్రభుత్వానిదేనని హెచ్చరించింది. అయితే పోటీలకు ముందు రోజు డబ్ల్యూఎఫ్ఐ ఈ నిర్ణయం ప్రకటించడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.








