General Dhiraj Seth: భారత సైన్యానికి కొత్త అధిపతి నియమితులయ్యారు. జనరల్ ధీరజ్ సేథ్ ఈరోజు అధికారికంగా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ (COAS)గా బాధ్యతలను స్వీకరించారు. సౌత్ బ్లాక్ లాన్స్లో జరిగిన సైనిక సంప్రదాయ కార్యక్రమంలో ఆయన బాధ్యతల మార్పిడి జరిగింది. ఈ సందర్భంగా జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ధీరజ్ సేథ్ భారత సైన్యానికి 31వ చీఫ్గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఆర్మోర్డ్ కార్ప్స్ (ట్యాంక్ రెజిమెంట్) నుంచి ఆర్మీ చీఫ్ పదవిని అధిరోహించిన ఏడవ అధికారిగా జనరల్ ధీరజ్ సేథ్ ప్రత్యేక రికార్డు సృష్టించారు. 1986లో 2nd Lancers విభాగంలో కమిషన్డ్ అధికారిగా తన సైనిక ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, దశాబ్దాల సుదీర్ఘ సేవలో అనేక కీలక బాధ్యతలను నిర్వర్తించారు.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో కీలక కమాండర్గా పనిచేసిన అనుభవం ఆయన కెరీర్లో ముఖ్య ఘట్టంగా నిలిచింది. అంతేకాకుండా సదరన్ కమాండ్, సౌత్ వెస్ట్రన్ కమాండ్ వంటి వ్యూహాత్మక విభాగాలకు ఆర్మీ కమాండర్గా కూడా సేవలందించారు.
రక్షణ రంగంలో ప్రణాళికలు రూపొందించడం, ఆధునిక సాంకేతికతను సైన్యంలో ప్రవేశపెట్టడం, భవిష్యత్ యుద్ధ అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాల అభివృద్ధి వంటి అంశాల్లో ఆయనకు విశేష అనుభవం ఉంది. భారత సైన్య ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారిగా ఆయన గుర్తింపు పొందారు. కొత్త ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన ధీరజ్ సేథ్ నాయకత్వంలో భారత భూసేన మరింత బలపడుతుందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.








