తొలిసారిగా నిర్వహించిన స్నాతకోత్సవంతో విశాఖపట్నంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మరో మైలురాయిని చేరుకుంది. ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయం ప్రారంభమైన తర్వాత నిర్వహించిన తొలి కాన్వొకేషన్ కావడంతో ఈ వేడుకకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ సందర్భంగా డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులు తమ పట్టాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. విద్యా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలను ప్రదానం చేసి అభినందించారు. విద్యను సమాజ అభివృద్ధికి సాధనంగా మార్చుకోవాలని రాష్ట్రపతి విద్యార్థులకు సూచించినట్లు అధికారులు తెలిపారు.
స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి.వి. కట్టమణి, రిజిస్ట్రార్ జితేంద్ర మోహన్తో పాటు పలువురు అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు.
అంతకుముందు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. గవర్నర్ అబ్దుల్ నజీర్, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత తదితరులు ఆమెకు స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా రాష్ట్రపతికి స్వాగతం పలుకుతూ, ఆంధ్రప్రదేశ్ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.
విశాఖలో ఘనంగా కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి కాన్వొకేషన్.. రాష్ట్రపతికి స్వాగతం పలికిన నారా లోకేష్
-








