Strait Of Hormuz: ఇటీవల శాంతి ఒప్పందంతో అమెరికా-ఇరాన్ సంబంధాలు మెరుగుపడతాయని భావించినప్పటికీ, హర్మూజ్ జలసంధికి సంబంధించిన తాజా పరిణామాలు కొత్త వివాదానికి తెరతీశాయి. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో అత్యంత కీలకమైన ఈ మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి రుసుములు వసూలు చేసే విషయంలో రెండు దేశాల వైఖరిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఎలాంటి టోల్ టాక్స్ విధించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఇరాన్ మాత్రం నేరుగా ట్రాన్సిట్ ఫీజులు విధించకపోయినా, సముద్ర భద్రత, నావిగేషన్ సేవలు, పర్యావరణ పరిరక్షణ, బీమా సదుపాయాలు, ఇతర సముద్ర సంబంధిత సేవల కోసం నిర్దిష్ట రుసుములు వసూలు చేసే అవకాశం ఉందని తెలిపింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకేయి వెల్లడించారు.
అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం సహజంగా ఏర్పడిన జలసంధుల ద్వారా ప్రయాణించే విదేశీ నౌకలపై నేరుగా పన్నులు విధించే అధికారం సంబంధిత దేశాలకు ఉండదు. అయితే, అదనపు సేవలు అందించిన సందర్భాల్లో పరిమిత రుసుములు వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే అంశం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
ఇరాన్ తాజా వైఖరి ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ముడి చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో కొత్త రుసుముల వ్యవహారం మళ్లీ భౌగోళిక ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.








