Union Cabinet Expansion: రాజ్యసభ ఎన్నికల అనంతరం కేంద్ర కేబినెట్లో మార్పులు, చేర్పులు ఉండొచ్చన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ వేడెక్కుతోంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా, జాతీయ రాజకీయాల్లో పలు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కొందరు కేంద్ర మంత్రులకు మరోసారి అవకాశం లభించకపోవడం గమనార్హం. దీంతో మంత్రివర్గంలో మార్పులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే ఉద్దేశంతో మరికొందరు నేతలను సంస్థాగత పదవుల వైపు మళ్లించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కే నేతల విషయంలో కూడా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. బీహార్కు చెందిన పలువురు నేతలకు(నితిన్ నబిన్, నితీష్ కుమార్) కేంద్ర కేబినెట్లో ప్రాధాన్యం పెరగవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టిన నాయకులతో పాటు అనుభవజ్ఞులైన నేతలకు కూడా అవకాశం లభించే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా మిత్రపక్షాలకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా కేంద్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కూటమికి చెందిన ఒక ప్రజాప్రతినిధికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించే అంశం పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే ఈ మార్పులపై అధికారిక స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో కేంద్ర కేబినెట్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.








