నీట్-యూజీ 2026 పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు హోరెత్తాయి. సోమవారం జరిగిన నిరసనల్లో గాయపడిన వారిని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా(JP Nadda) మంగళవారం పరామర్శించారు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి వెళ్లిన ఆయన బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరసన సందర్భంగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. అంతకుముందు నడ్డా తన నివాసంలో సీజేపీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.
ఈ భేటీలో పార్టీ నేతలు నీట్ వ్యవహారంపై తమ డిమాండ్లను ఆయన ముందుంచారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై చర్యలు తీసుకోవాలని, ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ను విడుదల చేయాలని కోరారు. సమావేశం అనంతరం సీజేపీ నేతలు మాట్లాడుతూ తమ అభ్యర్థనలను కేంద్రం పరిశీలిస్తుందని నడ్డా హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఎలాంటి తుది నిర్ణయం వెల్లడించలేదన్నారు.
‘సంసద్ చలో’ పేరుతో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, తల్లిదండ్రులు పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 118 మందికిపైగా పోలీసులు, దాదాపు 60 మంది నిరసనకారులు గాయపడినట్లు సమాచారం. నిరసనకారులు రాళ్ల దాడికి పాల్పడి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారని పోలీసులు ఆరోపించగా, తమపై పోలీసులు బలప్రయోగం చేశారని సీజేపీ నేతలు ఆరోపించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.

ALSO READ: UPI payment | నెట్ లేకున్నా పేమెంట్.. UPIలో అదిరిపోయే ఫీచర్








