TSPSC: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు టీజీపీఎస్సీ శుభవార్త అందించింది. మొత్తం 290 ఉద్యోగాల భర్తీ కోసం టీజీపీఎస్సీ మూడు ప్రత్యేక నోటిఫికేషన్లను విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 290 పోస్టులను భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీ మూడు కొత్త ఉద్యోగ ప్రకటనలు వెలువరించింది.
రోడ్లు-భవనాల శాఖ (ఆర్అండ్బీ)తో పాటు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ పోస్టులకు ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. నోటిఫికేషన్ ప్రకారం ఆర్అండ్బీ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) విభాగంలో 222 పోస్టులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) విభాగంలో 49 పోస్టులు ఉన్నాయి.
అలాగే తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ విభాగంలో 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు వేతనం లభించనుంది.
ఎంపిక కోసం జనరల్ స్టడీస్ మరియు సంబంధిత సబ్జెక్టులపై రెండు పేపర్ల పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 450 మార్కులకు పరీక్షలు జరుగుతాయి. ఎలక్ట్రికల్ పోస్టులకు జూన్ 8 నుంచి, సివిల్ పోస్టులకు జూన్ 6 నుంచి, పీసీబీ పోస్టులకు జూన్ 10 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. వివిధ పోస్టులకు జూలై మధ్య వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుండగా, పరీక్షలను సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించేందుకు కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది.








