అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆఫ్రికాకు చెందిన అత్యంత మోస్ట్ వాంటెడ్ ఐసిస్ కమాండర్( ISIS Top Commander), సంస్థలో నెంబర్-2 నాయకుడిగా ఉన్న అబు-బిలాల్ అల్-మినూకిని తమ దళాలు విజయవంతంగా హతమార్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆపరేషన్ అమెరికా బలగాలు మరియు నైజీరియా భద్రతా దళాల సంయుక్త చర్యగా నిర్వహించబడిందని తెలిపారు.
ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఈ విషయాన్ని ప్రకటిస్తూ, ఇది ఐసిస్ ఉగ్ర నెట్వర్క్కు పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలో క్రియాశీలకంగా ఉన్న మినూకి, ఐసిస్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ (ISWAP) లో కీలక కమాండర్గా పనిచేసేవాడని చెప్పారు. అతడు టెర్రర్ సెల్స్కు మార్గనిర్దేశనం చేయడం, దాడులకు ప్లానింగ్ చేయడం, నిధుల సమీకరణలో ప్రధాన పాత్ర పోషించాడని వివరించారు.
అమెరికా గూఢచార సంస్థల నిఘాతో అతడి కదలికలను గుర్తించి, వ్యూహాత్మక ఆపరేషన్ ద్వారా అతడిని హతమార్చినట్లు ట్రంప్ తెలిపారు. ఆఫ్రికా ప్రజలకు ఇది ఒక పెద్ద ఉపశమనం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మిషన్లో సహకరించిన నైజీరియా ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఐసిస్ ఒకప్పుడు ఇరాక్ మరియు సిరియాలో “ఖలీఫత్” ప్రకటించి ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసిన ఉగ్రవాద సంస్థగా గుర్తింపు పొందింది. 2014 తర్వాత ఈ సంస్థ పశ్చిమ దేశాలపై వరుస దాడులు చేసి భారీ నష్టం కలిగించింది.
అయితే అంతర్జాతీయ దళాల చర్యలతో సంస్థ అగ్ర నాయకత్వం వరుసగా హతమవుతూ వచ్చింది. ప్రస్తుతం ఐసిస్ చిన్న చిన్న టెర్రర్ సెల్స్ రూపంలో ఆఫ్రికా మరియు ఆసియా ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఈ తాజా ఆపరేషన్తో ఐసిస్ నెట్వర్క్ మరింత బలహీనపడిందని నిపుణులు భావిస్తున్నారు.








