West Bengal: అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో TMCకి వరుసగా రాజకీయ సంక్షోభాలు ఎదురవుతున్నాయి. కొందరు రాజ్యసభ సభ్యులు ఇప్పటికే రాజీనామా చేయగా, మరికొందరు పార్టీకి దూరంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో తాజాగా మరో కీలక ఘటన వెలుగు చూసింది. టీఎంసీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీలు ఒక్కసారిగా నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)లో విలీనం కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. నార్త్ 24 పరగణాస్లో జరిగిన ఈ ఘటన బెంగాల్తో పాటు కేంద్ర రాజకీయ వర్గాల్లోనూ పెద్ద సంచలనం సృష్టించింది.
NCPI వ్యవస్థాపకుడు, జాతీయ సంస్థాగత కార్యదర్శి శంతను డే ఈ విలీనాన్ని ధృవీకరిస్తూ పార్టీ అగ్రనాయకత్వం ఆన్లైన్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని స్వాగతించిందని తెలిపారు. పార్టీ విస్తరణ, సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తున్న తరుణంలో ఈ చేరికలు కీలక మలుపుగా భావిస్తున్నారు.
అంతర్గత విషయాలపై స్పందించిన శంతను డే, పార్టీ కార్యకలాపాలపై సమన్వయం లోపించిందని, ముఖ్య నేతలతో సంప్రదింపులు జరగకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యాయని పేర్కొన్నారు.
పార్టీ అధ్యక్షురాలు శ్వేలి కుందు బిజీగా ఉన్నారని చెప్పారని, కోశాధికారితో సంబంధాలు నిలిచిపోయాయని ఆయన తెలిపారు. 2023లో రిజిస్టర్ అయిన తమ పార్టీ 2025 తర్వాత నాయకత్వంతో పూర్తిస్థాయి సంప్రదింపులు జరగలేదని కూడా ఆయన వెల్లడించారు. ఆర్థిక సమస్యలు ఎదురైనప్పటికీ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు శంతను డే పేర్కొన్నారు. గతంలో త్రిపురలో ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఈ భారీ విలీనం నేపథ్యంలో బెంగాల్ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








