Pawan Kalyan: జనసేన పార్టీ ఆవిర్భావం వెనుక ఉన్న ప్రాథమిక లక్ష్యం దేశ సమగ్రత, దేశ శ్రేయస్సేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పదవులపై ఆశ లేకుండా, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీని ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలో ‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు.
పార్టీ ప్రారంభించి 12 సంవత్సరాలు పూర్తయిన ఈ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు వచ్చినా, సిద్ధాంతాల విషయంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. మారుతున్న రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తూనే, 7 ప్రాథమిక సూత్రాలను ఎప్పటికీ వదలలేదని ఆయన పేర్కొన్నారు. జనసేన ప్రారంభంలో కేవలం లక్ష మంది సభ్యులతో మొదలై, ప్రస్తుతం 20 లక్షలకుపైగా సభ్యత్వాలకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇటీవల కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది కొత్తగా పార్టీలో చేరుతున్నారని చెప్పారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటును జనసేన ఎప్పుడూ వ్యతిరేకించలేదని, అయితే 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తీరు వల్ల మాత్రమే ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.
అప్పటి కాంగ్రెస్ విధానాల కారణంగా ప్రజల్లో అసంతృప్తి, అస్థిరత ఏర్పడిందని విమర్శించారు. ప్రతి వ్యక్తి సమాజంలో మార్పు తీసుకురాగలడని, ప్రజల శక్తిని తక్కువగా అంచనా వేయరాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ, ప్రజా ఉద్యమాల శక్తిని ఉదాహరణలతో వివరించారు. దేశ స్ఫూర్తిని కాపాడటం ఒక రోజు పని కాదని, ప్రతి తరానికి అది బాధ్యతగా కొనసాగాలని ఆయన పేర్కొన్నారు.
Pawan Kalyan | అధికారం కోసం కాదు.. దేశ శ్రేయస్సే ప్రధానమని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
-








