Taliperu Project: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టులోని 24 గేట్లను ఎత్తి 98,761 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం తాలిపేరు రిజర్వాయర్లో 72.57 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లు కావడంతో నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఇదే సమయంలో ప్రాజెక్టులోకి 93,632 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి దిగరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.








