కృత్రిమ మేధ (AI) రంగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న వేళ, ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఓపెన్ఏఐ(OpenAI), ఆంథ్రోపిక్(Anthropic) వంటి సంస్థలకు గట్టి పోటీగా కొత్త తరహా AI Super Appను అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు. కంపెనీ తాజా త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. సత్య నాదెళ్ల మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న Copilot కేవలం చాట్బాట్గా కాకుండా, మరింత సమగ్ర సామర్థ్యాలతో వినియోగదారుల రోజువారీ అవసరాలను తీర్చగల AI Super Appగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఒకే వేదికపై అనేక రకాల పనులను పూర్తి చేసుకునేలా దీనిని రూపొందిస్తున్నామని, భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.
మైక్రోసాఫ్ట్ ఆర్థిక ఫలితాలు కూడా కంపెనీ దూకుడును ప్రతిబింబించాయి. ఈ ఏడాది సంస్థ వార్షిక ఆదాయం 331 బిలియన్ డాలర్లను దాటగా, క్లౌడ్ వ్యాపారం ఒక్కటే 214 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అలాగే జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 35.8 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించింది. తమ వార్షిక ఆదాయం 2025లో ఈజిప్ట్ స్థూల దేశీయోత్పత్తి (GDP) స్థాయికి చేరువగా ఉండటం విశేషమని నాదెళ్ల పేర్కొన్నారు.
మరోవైపు, దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ కూడా చరిత్రలోనే అత్యధిక నిర్వహణ లాభాన్ని ప్రకటించింది. కంపెనీ 62 బిలియన్ డాలర్ల నిర్వహణ లాభాన్ని నమోదు చేయగా, ఈ ప్రభావంతో దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ సూచీ KOSPI 4 శాతానికి పైగా లాభపడింది. ప్రపంచ టెక్నాలజీ రంగంలో AI ఆధారిత పెట్టుబడులు, వృద్ధి కొత్త ఊపును అందిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ALSO READ: Commonwealth Games 2026 | కామన్వెల్త్ గేమ్స్లో భారత్ దూకుడు.. స్వర్ణం – రజతం డబుల్ ధమాకా








