Telangana Heavy Rains: వాయుగుండం ఎఫెక్ట్తో ఉత్తర తెలంగాణ జిల్లాలు వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లి పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా ముంపులో చిక్కుకున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటిస్తూ జిల్లా యంత్రాంగాలు ఆదేశాలు జారీ చేశాయి.
ములుగు జిల్లా మేడారంలోని జంపన్న వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండగా, స్నానానికి దిగిన గట్కేసర్కు చెందిన ఓ భక్తుడు గల్లంతైన ఘటన ఆందోళన కలిగించింది. కన్నాయిగూడెం ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదవడంతో వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్, బీర్పూర్ మండలాల్లో 9 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మరోవైపు పెన్గంగా నది ఉద్ధృతంగా ప్రవహించడంతో ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్, తిర్యాని మండలాల్లోని 12 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా 46,410 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరుతోంది. దీంతో అధికారులు నంది, గాయత్రి పంప్హౌస్లలోని బాహుబలి మోటార్ల ద్వారా మధ్య మానేరు జలాశయానికి నీటిని తరలిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వాగులు, చెరువులు, వరద ప్రవాహాల వద్దకు వెళ్లవద్దని జిల్లా యంత్రాంగాలు హెచ్చరికలు జారీ చేశాయి.
ALSO READ: AI Super App | ఏఐ రేసులో మైక్రోసాఫ్ట్ దూకుడు.. కొత్త సూపర్ యాప్పై సత్య నాదెళ్ల కీలక ప్రకటన








