బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా సమ్రాట్ చౌధరీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామా చేసిన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరీ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. దీంతో బిహార్ చరిత్రలో మొదటిసారిగా బీజేపీ నేత ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న పరిస్థితి ఏర్పడింది.
సమ్రాట్ చౌధరీ రాజకీయ ప్రస్థానం 1990లో ఆర్జేడీ ద్వారా ప్రారంభమైంది. అనంతరం జేడీయూలో చేరిన ఆయన, రాజకీయ అనుభవాన్ని పెంచుకున్నారు. కొన్నేళ్ల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత తన పనితీరుతో పార్టీ నాయకత్వంలో కీలక స్థానానికి ఎదిగారు.
ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆయనపై పార్టీ అధిష్టానం పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది.
సామాజిక సమీకరణాల పరంగా కూడా ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బిహార్లో యాదవుల తర్వాత బలమైన వర్గంగా ఉన్న కుష్వాహా సామాజిక వర్గానికి సమ్రాట్ చౌధరీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇప్పటివరకు ఈ వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. గత ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనను పెద్ద నాయకుడిగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ హామీ నెరవేరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.








