Minister Sridhar Babu: రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. మంథనిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను ఎవరైనా బెదిరిస్తే “అడ్డంగా నరుకుతాం” అంటూ వ్యాఖ్యానించడం వివాదానికి కారణమైంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విపక్షాలు తీవ్రంగా స్పందించాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు వివరణ ఇచ్చారు. రాజ్ ఠాకూర్ శాంతిని కోరుకునే వ్యక్తి అని, కాంగ్రెస్ కార్యకర్తలను కొంతమంది బెదిరిస్తున్న పరిస్థితుల్లో వారికి ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన ఆవేశంగా మాట్లాడారని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కార్యకర్తల సమస్యలు విన్నప్పుడు వారిలో భరోసా కల్పించేందుకు అలా స్పందించాల్సి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు.
శాంతికి విఘాతం కలిగించే ఏ చర్యనైనా ప్రభుత్వం ఖండిస్తుందని, చట్టాన్ని అతిక్రమించే ఉద్దేశం ఎవరికీ లేదని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
అసలు ఘటన ప్రకారం, మంథనిలో జరిగిన సమావేశంలో రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, “మంథనిలో ప్రతిరోజూ శ్రీధర్ బాబు ఉండకపోవచ్చు కానీ కార్యకర్తలను ఎవరైనా బెదిరిస్తే రెండు గంటల్లో ఇక్కడికి వస్తాం.
ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తూ, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డాయి.








