Vande Mataram Protection Bill: ‘వందేమాతరం’ గేయానికి మరింత చట్టపరమైన రక్షణ కల్పించే ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ గేయాన్ని అవమానించడం శిక్షార్హమైన నేరంగా పరిగణించే బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. సభలో సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందగా, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రతిపక్ష సభ్యులు ఓటింగ్కు ముందు వాకౌట్ చేశారు. దీంతో బిల్లు ఎగువ సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఇటీవల రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న గౌరవానికి సమానంగా ‘వందేమాతరం’కు కూడా చట్టపరమైన రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.
బిల్లు ప్రకారం, వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినట్లు తేలితే జైలు శిక్షతో పాటు ఇతర శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపాదనపై అధికార, ప్రతిపక్షాల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ సాగింది. విపక్ష పార్టీల నిరసనలు, అభ్యంతరాల కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ బిల్లు.. బుధవారం జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభలో ఆమోదం పొందింది. దీంతో ‘వందేమాతరం’ గేయానికి చట్టపరమైన రక్షణ కల్పించే దిశగా మరో కీలక ముందడుగు పడినట్లైంది.
ALSO READ: Janasena | జనసేన మీడియా టీమ్లో భారీ మార్పులు.. కొత్త కమిటీకి రంగం సిద్ధం








