రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ను సందర్శించనున్నారు. భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు(BRICS Summit)లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి రానున్నట్లు క్రెమ్లిన్ అధికారికంగా ధృవీకరించింది.
భారత్–రష్యా మధ్య వ్యూహాత్మక, రక్షణ రంగ సంబంధాలు మరింత బలపడుతున్న సమయంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. గత డిసెంబర్లో జరిగిన 23వ భారత్–రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన భారత్ వచ్చారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సంబంధాల విస్తరణపై కీలక చర్చలు జరిపారు.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ 2024 డిసెంబర్లో తొలిసారి భారత్ పర్యటన చేశారు. అంతకుముందు 2021లో కూడా ఆయన భారత్ను సందర్శించారు. భారత్–రష్యా మధ్య ప్రతి ఏడాది జరిగే శిఖరాగ్ర సదస్సు సంప్రదాయం ప్రకారం ఒకసారి భారత్లో, మరోసారి రష్యాలో జరుగుతుంది.
ఈసారి ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో సభ్య దేశాల అధినేతలు పాల్గొననున్నారు. ప్రపంచ భద్రతా సవాళ్లు, ఆర్థిక సహకారం బలోపేతం, అంతర్జాతీయ సంబంధాలపై కీలక చర్చలు జరగనున్నాయి. పుతిన్ పర్యటనతో ఈ సదస్సుకు మరింత ప్రాధాన్యం లభించనుంది.








