Postal Franchise: భారత తపాలా శాఖ నిరుద్యోగ యువతకు మరియు స్వంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి గోల్డెన్ అవకాశాన్ని అందిస్తోంది. తపాలా సేవలను మరింత ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో “పోస్టల్ ఫ్రాంచైజీ” పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా తక్కువ పెట్టుబడితోనే స్వయం ఉపాధి పొందే అవకాశం కలుగుతోంది.
సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో కొత్త పోస్టల్ అవుట్లెట్లు ఏర్పాటు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సికింద్రాబాద్, వికారాబాద్ ప్రాంతాల నివాసితులు ఈ అవకాశానికి అర్హులు. కిరాణా షాపులు, స్టేషనరీ దుకాణాలు, పాన్ షాపులు లేదా చిన్న వ్యాపారాలు నిర్వహించే వారు తమ దుకాణాల్లోనే పోస్టల్ సేవలు ప్రారంభించవచ్చు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. కనీస విద్యార్హతగా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత తప్పనిసరి. అయితే డెలివరీ సేవల కోసం దరఖాస్తు చేసే వారు 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉంటే సరిపోతుంది.
అభ్యర్థులకు కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానం, స్మార్ట్ఫోన్ యాప్ల వినియోగం తెలిసి ఉండాలి. స్థానిక భాషతో పాటు ఇంగ్లీష్ మాట్లాడటం మరియు రాయడం రావాలి. డెలివరీ పనుల కోసం సొంత వాహనం మరియు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. పాన్ కార్డ్ కూడా అవసరం.
ఎంపికైన అభ్యర్థులు నిబంధనల ప్రకారం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు సమీప పోస్టాఫీస్ లేదా సికింద్రాబాద్ డివిజనల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువత ప్రభుత్వ గుర్తింపుతో స్థిరమైన ఆదాయాన్ని పొందే అవకాశం పొందవచ్చు.








