PM Modi: నీట్ ప్రశ్నాపత్రం లీక్( NEET paper leak) వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో స్పందించారు. ఈ ఘటనను “ఘోర పాపం”గా అభివర్ణించిన ఆయన, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. లీకేజీ వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, తిరిగి పరీక్ష నిర్వహించడంతో పాటు కేసులో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన ప్రధాని, భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు ఎవరూ పాల్పడకుండా కఠిన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థను మరింత పారదర్శకంగా, పటిష్టంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. నీట్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోవైపు ఈ అంశంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ముట్టడికి యత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నప్పటికీ, వారు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.
ALSO READ: Delhi Chalo March | ఢిల్లీకి రైతుల దండయాత్ర.. FTA ఒప్పందంపై రైతుల ఆగ్రహం








