10th class syllabus update: విద్యార్థులకు శుభవార్త చదువుకునే పిల్లలు ఒత్తిడికి గురి కాకుండా పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కేరళ ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. అకడమిక్ ఒత్తిడి తగ్గించే లక్ష్యంతో పదో తరగతి సిలబస్ను “25 శాతం వరకు తగ్గించాలని” నిర్ణయించింది.
ఈ కీలక ప్రకటనను విద్యాశాఖ మంత్రి “వి. శివకుట్టి” శనివారం కొల్లాంలో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
ఇటీవలి కాలంలో పదో తరగతి సిలబస్ ఎక్కువగా ఉండటంతో విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతోందని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిపుణుల సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అయితే సిలబస్ తగ్గించినప్పటికీ “పాఠ్యాంశాల నాణ్యతకు ఎలాంటి భంగం కలగనివ్వమని” స్పష్టం చేశారు.
కీలకమైన మూల అంశాలను తొలగించకుండా, పునరావృతంగా వచ్చే భాగాలను మాత్రమే తొలగిస్తామని తెలిపారు. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని చెప్పారు.
సిలబస్ తగ్గితే విద్యా ప్రమాణాలు పడిపోతాయన్న విమర్శలను మంత్రి ఖండించారు. మార్పులు పూర్తిగా శాస్త్రీయంగా, జాగ్రత్తగా అమలు చేస్తామని వెల్లడించారు.
ALSO READ:T20 World Cup 2026 | భారత్తో మ్యాచ్ బహిష్కరణ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టాలు








