India–US trade | భారత్–అమెరికా సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. గత ఏడాది సుంకాల వివాదంతో కొంత దెబ్బతిన్న ద్వైపాక్షిక వాణిజ్య బంధాలు, తాజాగా జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్తో కొత్త ఊపును అందుకున్నాయి. ఈ సంభాషణ అనంతరం ట్రంప్ సోషల్ మీడియాలో కీలక ప్రకటన చేశారు. భారత్పై విధించిన 18 శాతం సుంకాలను తగ్గిస్తున్నట్లు, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ వెల్లడించారు.
అలాగే భారత్పై అదనంగా 25 శాతం సుంకాలు ఉండవని స్పష్టం చేశారు. రష్యా చమురు సరఫరా అంశంలో భారత్ అంగీకరించిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు భారత్–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలకు మరింత బలం చేకూర్చనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ట్రంప్, ప్రధాని మోదీని “గొప్ప స్నేహితుడు”గా అభివర్ణించారు.
ఇరు దేశాల మధ్య మంచి వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. ఇండియా టుడే మ్యాగజైన్ కవర్లోని ట్రంప్–మోదీ ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ, ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడం భారత ప్రజలకు మేలు చేస్తుందని చెప్పారు.
రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కలిసి పనిచేస్తే ప్రపంచానికి స్థిరత్వం, శాంతి, శ్రేయస్సు లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. భారత్–అమెరికా భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ట్రంప్తో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
also read:Stock Market Today | Sensex, Nifty భారీ లాభాలతో ముగిశాయి
