Kavitha protest: పరిగి ప్రాంతంలో పరిశ్రమల స్థాపన పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ఈ అంశంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆమె వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతులతో కలిసి భారీ ధర్నా చేపట్టారు.
ప్రభుత్వం పారిశ్రామికీకరణ పేరుతో సాగు భూములను లాక్కోవడం సరైన చర్య కాదని కవిత మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలో సారవంతమైన భూములను పరిశ్రమల కోసం సేకరించడం రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తుందని ఆమె విమర్శించారు.
“తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూములను నమ్ముకుని జీవిస్తున్న రైతులను రోడ్డుపైకి నెట్టడం అన్యాయం” అని ఆమె స్పష్టం చేశారు. భూసేకరణ నోటిఫికేషన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ధర్నాలో భాగంగా వందలాది మంది రైతులతో కలిసి కవిత ఆర్డీవో కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన హోరెత్తించారు. భూసేకరణ ప్రక్రియను తక్షణమే ఆపకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు.
రైతుల సమ్మతి లేకుండా ఒక్క ఎకరా కూడా తీసుకోవద్దని, బలవంతపు భూసేకరణకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు. కవిత రాకతో వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం పరిసరాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.








