భారత జెండా కలిగిన ఎల్పీజీ నౌక ‘జగ్ విక్రం’(Jag Vikram) విజయవంతంగా హోర్ముజ్ జలసంధి దాటి ఏప్రిల్ 14న కాండ్లా పోర్టుకు చేరుకుంది. ఏప్రిల్ 11న ప్రయాణం ప్రారంభించిన ఈ నౌకలో మొత్తం 20,400 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సరుకు ఉంది.

మంగళవారం రాత్రి ఆలస్యంగా కాండ్లా పోర్టులోని ఆయిల్ జెట్టి నెంబర్-1 వద్ద నౌక నిలిచింది. త్వరలోనే సరుకు దిగుమతి ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో దేశంలో ఎల్పీజీ సరఫరా మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం హోర్ముజ్ మార్గం గుండా ప్రయాణించిన తొలి భారత నౌకగా ‘జగ్ విక్రం’ నిలవడం విశేషం. ఇది భారతానికి వ్యూహాత్మకంగా కీలక పరిణామంగా భావిస్తున్నారు.
గల్ఫ్ ప్రాంతంలో సముద్ర మార్గాల భద్రతపై నిఘా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నౌక సురక్షితంగా చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా ఉండగా, హోర్ముజ్ జలసంధిలో నిలిచిపోయిన 15 భారత నౌకలను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. పరిస్థితులు అనుకూలించగానే ఆ నౌకలను తిరిగి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.
గల్ఫ్ దేశాల నుంచి భారత్కు వచ్చే ఎల్పీజీ దిగుమతుల్లో దాదాపు 90 శాతం వాటా ఉండటం వల్ల ఈ మార్గం అత్యంత కీలకం. ప్రస్తుతం భారత నౌకలు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ‘జగ్ విక్రం’ రాక దేశ ఇంధన భద్రతకు ఊతమిచ్చే పరిణామంగా భావిస్తున్నారు.







