మన దేశ ప్రధానికి మద్దతు తెలుపుతూ ఇంధన పొదుపుకు ముందుకు వచ్చి కమల్ హాసన్ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి రాజ్యసభ సభ్యుడు, మక్కల్ నీధి మైయం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్(Kamal Haasan) మద్దతు ప్రకటించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న వేళ ప్రధాని ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు ఆయన బహిరంగంగా స్పందించారు.
దేశ ప్రయోజనాలు రాజకీయాల కంటే ముఖ్యమని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (X) వేదికగా వీడియో సందేశాన్ని విడుదల చేశారు. “నా ప్రియమైన భారతీయులారా.. ఇరాన్ యుద్ధ ప్రభావంపై తీవ్ర ఆందోళనతో మాట్లాడుతున్నాను” అంటూ తన సందేశాన్ని ప్రారంభించారు.
ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. దీని ప్రభావం నేరుగా సామాన్య ప్రజల జీవనంపై పడవచ్చని చెప్పారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే ఇంధన పొదుపు చర్యలు ప్రారంభించాయని ఆయన గుర్తుచేశారు. “60కి పైగా దేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గించే నిబంధనలు అమలు చేస్తున్నాయి” అని పేర్కొన్నారు.
భారత్ కూడా ఈ దిశగా ముందుగానే చర్యలు తీసుకోవాలని, ప్రధాని మోడీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు సమయోచితమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశం చాలా పెద్దదని, అందరూ కలిసి ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఇలాంటి సమయంలో రాజకీయ భేదాలను పక్కనబెట్టి దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని కమల్ హాసన్ పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మాటలను ఉటంకిస్తూ “ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి.. కానీ దేశం శాశ్వతం” అని గుర్తుచేశారు.
అదే సమయంలో పునరుత్పాదక ఇంధన రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కూడా ఆయన ప్రశంసించారు. సౌర, వాయు విద్యుత్ సామర్థ్యం గణనీయంగా పెరగడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు. అయితే ఇంధన ధరల భారం పూర్తిగా ప్రజలపై పడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించడం, రవాణా వ్యవస్థలో ఛార్జీలను సవరించడం వంటి చర్యలు అవసరమని ఆయన సూచించారు. అలాగే ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడకుండా, ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించేలా విధానాలు రూపొందించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం అన్ని వర్గాల ప్రజలపై పడుతుందని కమల్ హాసన్ హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని కలిసి ఎదుర్కొంటే భారత్ మరింత బలంగా ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు.








