Badrinath: భక్తుల నుంచి సేకరించే విరాళాల వ్యవహారంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో బద్రీనాథ్ ఆలయంపై దృష్టి పడింది. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు ఈ అంశంపై వాస్తవాలను వెలికితీసేందుకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. ఆలయ విరాళాల సేకరణ, నగదు నిర్వహణ, లెక్కల ప్రక్రియలో పారదర్శకత ఉందా లేదా అనే అంశాలను కమిటీ పరిశీలించనుంది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన మార్పులు, సంస్కరణలపై కూడా నివేదిక అందించాలని ప్రభుత్వం సూచించింది.
బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ (బీకేటీసీ) ఆధ్వర్యంలో బద్రీనాథ్ ఆలయంతో పాటు మరో 44 దేవాలయాల నిర్వహణ కొనసాగుతోంది. అంతేకాకుండా కొన్ని విద్యాసంస్థలు, ధర్మశాలల పర్యవేక్షణ బాధ్యతలు కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఆలయ విరాళాల వ్యవహారంలో జరిగిన పరిణామాలను నిర్ధారించేందుకు అధికారులు సీసీటీవీ వీడియోలను ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో నమోదైన విరాళాల వివరాలు, నగదు లెక్కింపు విధానం, సంబంధిత పత్రాలు, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
మరోవైపు బీకేటీసీ స్థాయిలో కూడా అంతర్గత విచారణ కొనసాగుతోంది. ప్రాథమిక దర్యాప్తులో కొన్ని అవకతవకలకు సంబంధించిన అంశాలు గుర్తించిన నేపథ్యంలో ప్రమోద్ నౌట్యాల్ అనే ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు కమిటీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది తెలిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం తప్పిదాలకు పాల్పడిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం కావడంతో విరాళాల నిర్వహణలో మరింత పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.








