Actor Rajpal Yadav: బాలీవుడ్ హాస్యనటుడు రాజ్పాల్ యాదవ్కు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్కు సంబంధించిన పలు కేసుల్లో దిగువ కోర్టులు విధించిన శిక్షను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కేసులో ఫిర్యాదుదారు దాఖలు చేసిన ఏడు వేర్వేరు ఫిర్యాదుల్లోనూ పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రతి కేసుకు సంబంధించి కోటి రూపాయలకు పైగా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే ఇప్పటికే రాజ్పాల్ యాదవ్ చెల్లించిన సుమారు రూ.2 కోట్లను తుది పరిహారం నుంచి మినహాయించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది.
ఈ వివాదానికి మూలం ఓ సినిమా నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలేనని కోర్టు విచారణలో వెల్లడైంది. సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని నటుడి తరపు న్యాయవాది వాదించినప్పటికీ, కోర్టు ఆ వాదనను అంగీకరించలేదు. గతంలో మెజిస్ట్రేట్ కోర్టు, అనంతరం సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పులను సవాలు చేస్తూ రాజ్పాల్ యాదవ్, ఆయన భార్య రివిజన్ పిటిషన్లు దాఖలు చేశారు.
అయితే కోర్టుకు ఇచ్చిన హామీల మేరకు బకాయిలను చెల్లించడంలో పదేపదే విఫలమయ్యారని ధర్మాసనం పేర్కొంది. దీంతో దిగువ కోర్టుల తీర్పును సమర్థిస్తూ మూడు నెలల జైలు శిక్షను కొనసాగించింది. ఇదే సమయంలో ఈ తీర్పును సవాలు చేసుకునేందుకు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కల్పిస్తూ రెండు నెలల గడువును కూడా మంజూరు చేసింది.








