Immigration rules in India: భారత్లో నివసించే విదేశీయులకు వర్తించే వీసా, నమోదు విధానాల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. దేశంలో తమ బసను పొడిగించాలనుకునే విదేశీ పౌరులు, వీసా చెల్లుబాటు ముగిసేలోపు విదేశీయుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని కేంద్రం వెల్లడించింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆరు నెలలలోపు గడువు కలిగిన వీసాలతో దేశంలోకి ప్రవేశించే విదేశీయులు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
ఇకపై దేశంలో ఎక్కువ కాలం ఉండాలనుకునే వారు వీసా గడువు పూర్తికాకముందే సంబంధిత అధికారుల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా 14 రోజుల లోపు వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది.
అయితే తాజా నిబంధనలతో ఆ వెసులుబాటును కేంద్రం రద్దు చేసింది. ముందస్తు రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేస్తూ విదేశీయుల వివరాల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అదే సమయంలో భారత్లో నివసిస్తున్న విదేశీయులకు జన్మించే పిల్లల నమోదుపై కూడా కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. విదేశీ పౌరులకు చెందిన శిశువు భారత్లో జన్మిస్తే, పుట్టిన 30 రోజుల లోపు ఆన్లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే తల్లిదండ్రుల్లో ఒకరు భారత పౌరులై ఉండి, తమ భారతీయ పౌరసత్వాన్ని కొనసాగించాలనుకుంటే, అలాంటి కుటుంబాలకు ఈ జనన నమోదు నిబంధన నుంచి మినహాయింపు వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.








