Supreme Court judges: భారత సుప్రీంకోర్టులో మంగళవారం ఐదుగురు కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న న్యాయమూర్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సమక్షంలో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జస్టిస్ అరుణ్ పల్లి, సీనియర్ న్యాయవాది వి. మోహన ప్రమాణ స్వీకారం చేశారు.
సుప్రీంకోర్టు కొలీజియం మే 27న వీరి పేర్లను సిఫార్సు చేయగా, కేంద్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా నియామకాలను ప్రకటించింది. ప్రమోషన్కు ముందు జస్టిస్ షీల్ నాగు పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు.
జస్టిస్ సంజీవ్ సచ్దేవా మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించగా, జస్టిస్ అరుణ్ పల్లి జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఇక సీనియర్ న్యాయవాది వి. మోహన నియామకం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
2018లో జస్టిస్ ఇందు మల్హోత్రా తర్వాత బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన రెండో మహిళగా ఆమె గుర్తింపు పొందారు.
ఆమె చేరికతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యం కూడా పెరిగింది. ఈ కొత్త నియామకాలతో సీజేఐతో కలిపి సుప్రీంకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తుల సంఖ్య 36కు చేరింది. ప్రస్తుతం ఆమోదించబడిన మొత్తం స్థానాల్లో కేవలం ఒక ఖాళీ మాత్రమే మిగిలి ఉంది.
అయితే త్వరలోనే జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ జె.కె. మహేశ్వరి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో మరో రెండు ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాజా నియామకాలు సుప్రీంకోర్టు పనితీరుకు కీలకంగా మారనున్నాయి.








